ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో ఎంపీ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. వివేకానంద విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి, బీజేపీ గెలిస్తే మోదీకి లాభం. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ మొత్తానికి లాభమని అన్నారు. ఐదేళ్ళలో మోడీ దేశానికి చేసిందేమీ లేదు. మోడీ వేడి తగ్గింది.. 150 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీకి 100 సీట్లు కూడా రావు. ఆలోచించి కాంగ్రెస్, బీజేపీలను దెబ్బ కొట్టాలని కేటీఆర్ సూచించారు.
నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయి. ఢిల్లీలో సంఖ్యాబలం ఉన్నోళ్ళదే పెత్తనం. చంద్రబాబు సంఖ్యాబలంతో ఏడు మండలాలను ఏపీలో కలిపాడు. రైల్వే మంత్రి ఎవరుంటే వాళ్ళ రాష్ట్రాలు, ప్రాంతాలకే రైళ్ళు పోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీ దర్బారులో గులాములని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ కూర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలని విమర్శించారు. ఈ రోడ్ షోలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.