mt_logo

బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు.. 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్‌కు మంచి సీట్లు రావాలె అని తెలిపారు.

బీఆర్ఎస్‌కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలె. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలె అని పిలుపునిచ్చారు.

బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ గారు అని కొనియాడారు. బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలె. చెేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. అందరం కలిసి కాసాని అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అన్నారు.

అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలె. రైతుల దగ్గరకు వెళ్లి రూ. 2 లక్షల హామీ నెరవేరిందా అడగాలె. మీరంతా బహుబలి సినిమా చూశారా? అందులో రెండు పార్ట్‌లు ఉన్నట్లే.. రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 అయిపోతుంది. మోసం పార్ట్-2 సీక్వెల్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి మోసపోయింది చాలాదా? ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే నమ్మిన వాళ్లది తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు.. 100 రోజుల అబద్దాల పాలన ఒక వైపు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎంతో మంచి చేసిండు. చేవెళ్లలో బ్రహ్మండమైన అభివృద్ధి చేసుకున్నాం.. వికారాబాద్‌ను జిల్లా చేసుకున్నాం. 111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలె అని కోరారు.

బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడుగుమంటే చెప్పేందుకు ఒక్కటి లేదు. మోడీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏం ఇచ్చినవ్. రాముడితోని మనకు పంచాయితీ లేదు.. రాముడు అందరివాడు. మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలె అని అన్నారు.

ఆడబిడ్డలు ఆలోచించాలె.. మోడీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలె..క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిన్రు. 70 రూపాయల పెట్రోల్‌ను 110 చేసినందుకా? డిజీల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి? అని ప్రశ్నించారు.

బండి సంజయ్ మాత్రం మోడీ దేవుడు అంటాడు.. ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే బీజేపీకి ఖచ్చితంగా మన బుద్ధి చెప్పాలె. ఈ ప్రాంతానికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు అడుగుతాడు. కృష్ణానీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని తేల్చలేదు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వని పార్టీ అంటే బీజేపీయే. బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు.

ఈటల, రఘునందన్ రావు, అరవింద్, సోయం బాపురావును ఓడించిందెవరు.. కిషన్ రెడ్డిని పోటీ చేసేందుకే భయపడేలా చేసిందే బీఆర్ఎస్ అన్న విషయం గుర్తుంచుకోవాలె.. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన వెంటనే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు మంచోళ్లు.. అమ్మలాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చేవెళ్లలో బలహీనవర్గాల అభ్యర్థి కాసాని గెలిపించుకుందాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు 8-10 సీట్లు ఇస్తే మనమే అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చు అని కేటీఆర్ అన్నారు