నేడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లోని ఎంఎన్ జే ఆసుపత్రిలోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నాలుగో ఫ్లోర్ లో ఉన్న మాడ్యులర్ థియేటర్లు, దోబీ ఘాట్, కిచెన్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దేశంలో తొలిసారిగా ఆంకాంలజీ స్పెషల్ నర్సింగ్ కోర్స్ తెలంగాణలో రాబోతుందని ప్రకటించారు. మరో నెల రోజుల్లో ఎంఎన్ జే లో 30 కోట్ల నిధులతో రోబో థియేటర్ సిద్ధమవుతుండగా… నేడు 7 మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభం అయ్యాయన్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 450 పడకలు అందుబాటులో ఉండగా, కొద్ది రోజుల్లో 350 పడకల కొత్త బిల్డింగ్ ఏర్పాటవుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం రూ.5 కోట్లతో మోడ్రన్ దోబి ఘాట్, కిచెన్ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత రూ. 750 కోట్లు క్యాన్సర్ రోగులకు ఖర్చు చేశామని.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. నిమ్స్ లో నెలకు 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేస్తుండగా.. ఎంఎన్ జే లో లో రెండు చేస్తున్నారన్నారు. ఈ థియేటర్స్ కారణంగా మరిన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ లకు ఆస్కారముంటుందని చెప్పారు. 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వంటి కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కోటి రూపాయిలతో ఏర్పాటు చేసిన కాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ అన్ని జిల్లాలలో తిరుగుతుందని, దీని కోసం 22 క్యాంపులు పెట్టి… స్క్రీనింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలకు ఎంఎన్ సీ నుంచి అనుమతి వచ్చిందని, 33 జిల్లాల్లో నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటల్ లో దేశంలోనే తొలి రోబోటిక్ థియేటర్ ను మన రాష్ట్రంలో తీసుకొచ్చామని హరీష్ రావు తెలిపారు.