మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, ప్రతినిధుల బృందం నివాళులర్పించనున్నారు.
ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ గారితో ఉన్నది అని అన్నారు.
వారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధమున్నది. వారెంతో స్థిత ప్రజ్జత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు అని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా వున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను అని గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని తెలిపారు.