రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కానుక చీరెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.333 కోట్లతో 1.10 కోట్ల చీరలను పంపిణీకి తయారు చేయించింది. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను రూపొందించారు. తయారైన చీరెలను ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లాలకు పంపనున్నారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారిగా రేషన్ షాపులకు సమీపంలో బతుకమ్మ కానుక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో రేషన్ డీలరు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు… నగరాలు, పట్టణాల్లో రేషన్ డీలరు, పురపాలక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరగనుంది.