ఏనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని టీ-హబ్లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దేశంలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. 15 వందలకుపైగా మల్టీనేషన్ కంపెనీలు హైదరాబాద్లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్ బ్రాంచిని హైదరాబాద్లో ప్రారంభించాయని వెల్లడించారు. ప్రపంచంలో భారత్ నంబర్ వన్లో ఉండాలంటే ఇన్నేవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్నెస్ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు. ఫార్మస్యూటికల్ హబ్, బయోసైన్స్ హబ్గా ఉందని చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే తయారవుతాయని వెల్లడించారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు.