mt_logo

అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు జరపాలి : మంత్రి కేటీఆర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి… మార్చ్ 6,7,8 తేదీల్లో మహిళా బంధు పేరిట నిర్వహించే సంబరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని, ఇలా చేయ‌డం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది మ‌హిళ‌ల‌కు కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లైంద‌న్నారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.

6న కేసీఆర్‌కు రాఖీలు క‌ట్ట‌డం: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ సంబ‌రాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన పార్టీ మ‌హిళా నాయ‌కులు కేసీఆర్‌కు రాఖీలు క‌ట్టాల‌ని కేటీఆర్ సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్ల‌తో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం నిర్వ‌హించాల‌న్నారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్‌ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

7న ల‌బ్దిదారుల‌తో సెల్ఫీలు: క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌, కేసీఆర్ కిట్‌తో పాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల నివాసాల‌కు టీఆర్ఎస్ నాయ‌కులు నేరుగా వెళ్లి క‌ల‌వాల‌న్నారు. అనంత‌రం ల‌బ్దిదారుల‌తో ముచ్చ‌టించి, సెల్ఫీలు తీసుకోవాల‌ని సూచించారు.

8న మ‌హిళ‌ల‌తో స‌మావేశాలు : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజున‌(మార్చి 8) నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మ‌హిళ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. అనంత‌రం సంబరాలు నిర్వ‌హించాల‌ని కేటీఆర్ చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు ధ‌న్య‌వాదాలు :
గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని కొనియాడారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆడ‌బిడ్డ‌ల‌కు నీటి క‌ష్టాల‌ను దూరం చేసేందుకు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని అమ‌లు చేసి, విజ‌య‌వంతం చేశారు. మాతా శిశు సంర‌క్ష‌ణ కోసం కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లు చేశామ‌న్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుతో మాతా శిశు మ‌ర‌ణాలు తగ్గాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సుర‌క్షిత ప్ర‌స‌వాలు పెరిగాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు రూ. 9,022 కోట్లను పెళ్లి కానుకగా అంద‌జేశామ‌న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నదన్నారు. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నదని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.

విద్యాశాఖ‌లోనూ అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు :
విద్యాశాఖలోనూ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టిన‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయ‌డంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 70 లక్షల హెల్త్, హైజిన్ కిట్లను విద్యార్థినుల‌కు అందించామ‌న్నారు. ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మ‌న‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మ‌హిళ‌ల కోసం అనేక కార్యక్రమాలను చేప‌ట్టామ‌ని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *