mt_logo

కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన 31 వేల కోట్ల నిధుల విడుదలలో తీవ్ర జాప్యం

కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు చేసుకొని రికార్డుస్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకొన్నప్పటికీ… తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి రూపొందించుకొన్న బడ్జెట్ పన్నుల రూపంలో 22.17 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ అంచనాలకు మించి ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి అంటే గత నెల మార్చి 31వ తేదీ నాటికి రికార్డుస్థాయిలో 27.07 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు అధికారికంగా ప్రకటించారు. మరి ఇకనైనా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 31,105 కోట్ల 77 లక్షల రూపాయల నిధులను సకాలంలో విడుదల చేస్తారా లేదా అనేది తెలంగాణ ఆర్ధికశాఖ అధికారుల్లో ఇపుడు చర్చాంశనీయం అయింది.

కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్ళల్లో ఏకంగా 49 శాతం పెరుగుదలతో 14.10 లక్షల కోట్ల ఆదాయంతో పాటు, పరోక్ష పన్నుల వసూళ్ళల్లో 30 శాతం పెరుగుదల నమోదు కాగా, మొత్తంగా 12.90 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది… పన్నుల ఆదాయంలో ఇంకా పెరుగుదల నమోదు కావాల్సి ఉంది. కానీ పన్నుల రూపంలో ఆదాయాన్ని చూపిస్తే రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందనే నెపంతో సెస్, సర్‌చార్జీల పేరుతో ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న కేంద్రం రాష్ట్రాలను బురిడీ కొట్టిస్తోంది. ఈ సెస్, సర్‌చార్జీల నిధులను కూడా పన్నుల ఆదాయంలో కలిపితే కనీసం మరో 2.50 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని రాష్ట్రాల అధికారులు వివరిస్తున్నారు. ఇకనైనా తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మరోసారి కేంద్రానికి లేఖ రాసే ప్రతిపాదన ఉందని అధికారులు వివరించారు. తెలంగాణలో ఫార్మాసిటీ, ఇతర పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి 14 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఆ నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని, మిషన్ కాకతీయ పథకాన్ని దేశం యావత్తూ కొనియాడిందని, చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మెచ్చుకొన్నారేగానీ ఆ పథకానికి ఇవ్వాల్సిన 5,205 కోట్ల రూపాయల నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని పేర్కొన్నారు.

కాగా నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయాలని, ఆ మేరకు నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు కేంద్రాన్ని కోరుతూ లేఖలు కూడా రాశారు. మున్సిపాలిటీలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా రంగానికి 7,800 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి కే.టి.ఆర్. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నాలుగు లేఖలు రాశారని ఆ అధికారులు గుర్తుచేశారు. అంతేగాక చేనేత, టెక్స్‌టైల్స్ పరిశ్రమల కోసం 954 కోట్ల 96 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని తెలిపారు. స్పెషల్ గ్రాంట్ కింద 723 కోట్లు, రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన నిధులను కేంద్రం అవగాహనా రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్‌కు మళ్ళించిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కూడా ఇవ్వలేదని, ఇకనైనా విడుదల చేయాలని కోరుతున్నారు. వీటికితోడు పెండింగ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ జీ.ఎస్.టి. నిధులు 210 కోట్లను కేంద్రం తెలంగాణాకు ఇవ్వాల్సి ఉండగా ఆ నిధులను కూడా ఇవ్వకుండా సతాయించడం అన్యాయం అని ఆర్ధికశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. స్థానిక సంస్థలకు కూడా కేంద్రం నుంచి తెలంగాణకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని, బీఆర్‌జీఎఫ్ బకాయిలు 900 కోట్లు ఉన్నాయని, ఇవన్నీ కలిపితే 31,105 కోట్ల 77 లక్షల రూపాయలుగా తేలిందని ఆ అధికారులు వివరించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం ఉన్న సంగతి తెలిసి కూడా ఇలా వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వకుండా మొండికేస్తే ఎలా? అని ఆ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే 41 శాతం నిధులు కూడా తగ్గిపోయాయని, ఆ వాటా నిధులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా నిధులు పెరగాల్సిందిపోయి తగ్గిపోతున్నాయని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 23,165 కోట్ల రూపాయలు మాత్రమే పన్నుల వాటా నిధులు వస్తాయని, వాస్తవానికి కనీసం 30 వేల కోట్ల రూపాయల వరకూ రావాల్సి ఉందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *