దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… దేశం ఎకానమీలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని, తెలంగాణకు సహకరించకుండా కేంద్రం ప్రతీ విషయంలో మోకాలడ్డుతోందని దుయ్యబట్టారు. గత ఏడేన్నరేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆపలేరన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని, వైద్యసేవల రంగంలో దేశంలోనే ముందు ఉన్నామని అన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు బంధు 11 రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుబంధును కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు.