mt_logo

కేంద్రం తెలంగాణకు చేసింది శూన్యం… బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో నూతనంగా నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులు మరియు మెడికల్ కాలేజ్ స్థలాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజీపీ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఉద్యోగాలు, నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు ? ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….? బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి…మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు.. దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలి. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని, అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. దీనిని అడ్డుకునేందుకే బీజేపీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటలో చలి కాచుకుంటున్నది. ఈ ఏడాది జనవరి 20న సీఎంఐఈ వెల్లడించిన వివరాల ప్రకారం… గత నెల డిసెంబర్‌ నాటికి దేశంలో 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ తెలిపింది. ‘ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్‌ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది’ అని సీఎంఐఈ స్పష్టం చేసింది. సీఎంఐఈ ప్రకారం జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం శాత 7.91% ఉంటే తెలంగాణలో 2.2% మాత్రమే ఉంది అని వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్రం లెక్కల్లో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆర్మీలో 2 లక్షలు, రైల్వేల్లో మూడు లక్షలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే అవి భర్తీ చేయమని మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి.. గత 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే.. బిజెపి నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంటే… కేంద్రంలోని బిజెపి దేశాన్ని నిరుద్యోగ భారత్ గా మార్చుతుంది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల శాతంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తెలంగాణ జనాభాలో 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బీహార్ లో 0.3 %, యూపీ లో 1%, బెంగాల్ 1.1%, గుజరాత్ 1.1 %, కర్ణాటక 1.2%, తమిళనాడు 2% జనాభా ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్నారు. కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్ కు అమ్మేసింది. దీంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు LIC సహా అనేక కంపెనీల వాటాలను అమ్మెస్తోంది. ఎయిర్ ఇండియాను టాటాకి అప్పగించారు. కేంద్రం IDBI సహా 2 ప్రభుత్వ రంగ బ్యాంక్ లను ప్రైవేటికరణ చేస్తోంది. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా? కేంద్రం చర్యలతో ఉద్యోగాలకు ఎసరు రావడంతో పాటు sc, st, obc, ews అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరగతుల సాధికారత కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికి, అన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే… మీరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దివలాకోరు మాటలను బీజెపీ నేతలు ఇకనైనా మానుకోవాలి. యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోరు, తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెస్తామంటే ఓర్వరు, దళిత బంధు విషయంలో అడ్డగోలు ఆరోపణలు చేస్తారు.. ఎందుకంత అక్కసు మీకు..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేయ‌రు.. ఇక్క‌డ మేం చేస్తే అడ్డుకుందామ‌ని చూస్త‌రు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురారు, విభ‌జ‌న హామీల నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నించ‌రు. అబద్దాలు ప్ర‌చారం చేసుకుంటూ.. రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్త‌రు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను బిజెపి ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థలు రాకుండా తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నది. దేశంలో ఏడేళ్ల లో కొత్తగా 7 ఐఐఐఎంలు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్న.., ఐఐటీలు 7 తెలంగాణకు కేటాయించినవి సున్న..,న ఐఐఐటీలు 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకు కేటాయించినవి సున్న.., 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు ఇచ్చినవి సున్న.., 84 నవొదయలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు సున్న.., వీటిని రాష్ట్రానికి తెప్పించడంలో రాష్ట్రంలోని బీజీపీ ఎంపిల కృషి శూన్యం. ఇలాంటి అబద్దాలకోరు బీజేపీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ నమ్మబోరు.” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *