mt_logo

కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు తక్షణమే నిలిపి వేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఏవిధమైన అనుమతులు లేకుండా కృష్ణాబేసిన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని, తక్షణమే వాటిని నిలిపి వేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ ఎంపి సింగ్‌కు లేఖ రాశారు. ఏపి ప్ర భుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులను నిలిపివేయించాలని కోరుతూ ఇప్పటివరకూ తాము బోర్డు కు 40కిపైగా లేఖలు రాసినట్టు ఈఎన్సీ తెలిపారు. తాము చేసిన ఫిర్యాదులపైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఏపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవిధమైన అనుమతులు పొందకుండానే అక్రమంగా మరిన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇకనైనా బోర్డు స్పందించి ఏపిలో జరుగుతున్న ఆయా ప్రాజెక్టుల పనులు వెంటనే నిలిపి వేయించాలని లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వాటి ప్రభావం కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ,నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై పడుతుందని తెలిపారు. తాము ఇదే అంశాలను 15వ బోర్డు మీటింగ్‌లో కూడా వివరించామని, అలాగే కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినట్టు తెలిపారు. కృష్ణానదీజలాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఇప్పటికే అన్యాయం జరిగిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటిపంపిణీలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని కోరుతూ రెండవ ట్రిబ్యునల్ ను కూడా కోరినట్టు తెలిపారు. ఏపి ప్రభుత్వం అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించడం ,ఇప్పటికే వున్న ప్రాజెక్టులను మరింత అధిక సామర్థ్యంతో విస్తరించే పనులు కూడా చేపట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏపిలో జరుగుతున్న ఈ పనుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులపైనే కాకుండా, అన్‌గోయింగ్ ప్రాజెక్టులపై కూడా వాటి ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాలను కూడా ఏపి ఉల్లంఘిస్తోందన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఒప్పందాలను పాటించటం లేదన్నారు. వీటిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాని కోరారు. గతంలో గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సులజ స్రంవంతి పథకాల విస్తరణ పనులు ,ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసి విస్తరణ పనులు , తెలుగు గంగ పధకం ప్రధాన కాలువ వెంట మిని ఎత్తిపోతల పథకాలు, కుందూ నది విస్తరణ పనులను వివరిస్తూ లేఖల ద్వారా ఇదివరకే బోర్డు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఇప్పటికైనా బోర్డు స్పందించి ఏపిలో అక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టుల పనులు నిలిపివేయించాలని కోరూతూ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *