mt_logo

‘పద్మశ్రీ’ రామచంద్రయ్యకు ఘన సత్కారం

గిరిజన కళలు, జాతులను కాపాడుతూ… వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కృషి చేస్తోంది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్. సోమవారం నగరంలోని గిరిజన మ్యూజియంలో కోయజాతి ఆణిముత్యం, జానపద కళాకారులు, డోలి వాయిద్యకారులు పద్మశ్రీ రామచంద్రయ్యను మంత్రులు సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు, తదితర అధికారులు కలిసి ఘనంగా సత్కరించారు. ఆయనకు పట్టు వస్త్రాలతో పాటు శాలువా కప్పి, లక్ష రూపాయల నగదు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ… మేడారం జాతరలో సమ్మక్క – సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం ఈ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ది, అంకితభావానికి నిదర్శనమన్నారు. గతేడాది గుస్సాడి కనకరాజును, ఈ ఏడాది రామచంద్రయ్యలను పద్మశ్రీలకు ప్రతిపాదించడం ద్వారా గిరిజన కళల గొప్పతనాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు. ఆదివాసీ కోయబిడ్డ ఎక్కడో పుట్టి, కళకు గొప్పసేవ చేసి భారత పురస్కారం పద్మశ్రీ పొందారు. పద్మశ్రీ పురస్కారాలు గొప్ప వారికే కాదు తమ పని తాము చేసుకుంటూ పోయే మారుమూల గిరిజనులకు కూడా వస్తాయి అని చెప్పడానికి ఈ ఆదివాసీ ఆణిముత్యాలు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా కళాకారులు కావడంతో రాష్ట్రంలో కళాకారులకు అత్యంత గౌరవం దక్కుతుందన్నారు. పద్మశ్రీ రామచంద్రయ్య కుటుంబానికి వారి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, వారి పిల్లలను గిరిజన శాఖ ద్వారా సముచితంగా ఆదుకుంటాం. తొందరలోనే రామచంద్రయ్యను సీఎం కేసీఆర్ తో కలిపించే ప్రయత్నం చేస్తున్నాం.

చాలా సంతోషంగా ఉంది : పద్మశ్రీ రామచంద్రయ్య

నేను ఎక్కడో కోయజాతిలో పుట్టాను. ప్రతిసారి మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెబుతాను. ఈసారి కూడా ముందు మేడారం జాతరకు వెళ్లాలని ఉంది.ఈ అవార్డు రావడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ సన్మానం చేయడం, నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని, నా కోయ జాతిని మంచిగా చూసుకోవాలని సీఎం కెసిఆర్‌ ను కోరుకుంటూ, వారికి పదివేల నమస్కారాలు అని రామచంద్రయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ… పద్మశ్రీ రామచంద్రయ్య మేడారం చరిత్ర ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. ఆయనకు నేడు ఈ గుర్తింపు రావడం నిజంగా ఆయన సేవలకు అందిన తగిన గౌరవం. ఇలాంటి గొప్ప కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది. త్వరలోనే రామచంద్రయ్యకు కూడా ఈ పెన్షన్ వస్తుంది. ప్రభుత్వ విప్ కాంతారావు మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తరవాత కనుమరుగు అయ్యే కళలు, జాతులను గుర్తించి పద్మశ్రీ వంటి వాటితో గుర్తించడం గొప్ప విషయమని, సకిని రామచంద్రయ్యకు మరోసారి అభినందనలు తెలియజేశారు. మా సంస్కృతి దోపిడికి గురి అవుతున్న సమయంలో, మా సంస్కృతిని కళలను కాపాడే గొప్ప నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. పాఠశాలల్లో ఇటువంటి కళలను ప్రోత్సహిస్తాం అనడం నిజంగా గొప్ప విషయం. ఈ జాతులు, కళలను భవిష్యత్ తరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సంక్షేమ శాఖ పాత్ర అత్యంత ముఖ్యమైందని అన్నారు. క్రిస్టినా జడ్ చొంగ్తూ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ మాట్లాడుతూ… డోలీ కళను ప్రోత్సహించేందుకు గిరిజన శాఖ కొన్నేళ్ల నుంచి పని చేస్తోంది. రామచంద్రయ్యకు పద్మశ్రీ వంటి గొప్ప పురస్కారం రావడంతో ఈ కళను మరింత పటిష్టం చేసేందుకు అవకాశం లభిస్తుంది. డోలి కళను గురుకులాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తాం అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *