mt_logo

ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు రాజన్న సిరిసిల్లా ఎంపిక

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెల్త్ ప్రొఫైల్ వైద్య పరీక్షలను ముందుగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ములుగు జిల్లాలో మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన వైద్య పరికరాలను, ఇతర వస్తువులను కొనడానికి దాదాపు 9 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ రూపొందిస్తోంది. పల్లెల్లో ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ ఇంటికి తిరుగుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్‌ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఈసీజీ వంటి పరీక్షలను మాత్రం ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్‌ ఐడీని అందజేస్తారు. ఈ ఐడీ ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. యూనిక్‌ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వారి ఆరోగ్య చరిత్రను ఆన్‌లైన్‌లో డాక్టర్లు చూడడానికి వీలుపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *