జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతు భీమా తరహాలోనే నేతన్న పథకం అమలు చేయనున్నామనితెలియ జేశారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో (LIC) తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 60 ఏండ్లలోపు వయస్సున్న చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ బీమా పథకానికి అర్హులని చెప్పారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. అర్హులైన చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

