పచ్చదనం పెంపులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పచ్చదనం 24 శాతం నుండి 31 శాతానికి పెరిగిందని అన్నారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నగరాల్లో భవనాలు కూలగొట్టి చెట్లు నాటే పరిస్థితులు భవిష్యత్లో రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో తమకు చెప్పారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. సరళతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం అత్యంత ప్రాధాన్యమైన అంశం అన్నారు. పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు అనుమతుల విషయంలో ఆటవీశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.
తెలంగాణ, హైదరాబాద్ ఈవోడీబీ ర్యాంకులతో పాటు పచ్చదనం పెంపులోనూ అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మౌళిక సదుపాయాలు దేశంలో ఏ ఇతర నగరంలో లేవన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను పచ్చదనం పెంపు కోసం సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. బాగా పనిచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా కాంపా నిధులను అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాల తరహాలో అటవీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీడ్ బాల్స్ వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించాం అని కేటీఆర్ తెలిపారు.