సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడకంట్ల జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యార్థుల జీవితాలకు వెలుగులు ప్రసాదించే విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో నాలుగు వందల గురుకులాలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తరువాత 1150 జూనియర్ కళాశాలలను రెసిడెన్షియల్ కళాశాలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు ఉన్న కస్తూర్బా పాఠశాలలను 270 జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. ఇటీవల పీజీ ఎంట్రన్స్ సగానికి పైగా సీట్లు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్ధులు సాదించడం శుభ పరిణామం అన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాటిల్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, తదితులు పాల్గొన్నారు.