తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుష్టపరిపాలనకు తెరతీసిందని ధ్వజమెత్తారు.
రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు విధించే ప్రయత్నం చేస్తూ దగా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న విషయం డీజీపీ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ప్రస్తావించారు. అక్రమ కేసులు బనాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు.
సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాటు ప్రజలను కేసీఆర్ కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు.
రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని, రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏం చేయలేదని ఎండగట్టారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వడం, కళ్యాణ లక్ష్మీలో భాగంగా తులం బంగారం ఇవ్వడం ఏమైందని ప్రశ్నించారు. హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతీ మూడు గంటలకు మహిళలపై ఒక అత్యాచారం జరుగుతోందని, ప్రతీ ఐదు గంటలకు ఒక మహిళా కిడ్నాప్ అవుతోందని డీజీపీ వెల్లడించిన గణాంకాలు తెలియజేస్తున్నాయని గుర్తు చేశారు. మహిళా భద్రత కోసం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళా భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు.
పోలీసులు కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరగడం తప్పా ఏం చేయడం లేదని, కేసీఆర్ హయాంలో పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేది.. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడం దారుణని, సీఎం రేవంత్ రెడ్డి మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలిని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ తిరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనట్లు కాంగ్రెస్ హయాంలో రెండు పెద్ద ఎన్కౌంటర్లు జరిగాయని గుర్తు చేశారు. తుపాకి మోతలు ఉండవద్దన్న లక్ష్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు భగ్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం విడుదల చేసిందని అన్నారు. పనులు సాగించని కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను నరకయాతన పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో రీసర్వే చేసే ముందు భూముల వివరాలు తెలియజేస్తూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల రీసర్వే పేరిట ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద రాయన్న నమ్మకం ప్రజలకు, రైతులకు లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ వేనని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ జిల్లా అనాథగా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “జిల్లా నుంచి కనీసం ఒక మంత్రి కూడా లేరు. ఎంపీ ఉన్నా లేనట్లే… ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు.
ఆరు నెలల నుంచి నిజామాబాద్ కు పోలీసు కమిషనర్ లేకపోవడం దారుణమన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ నాయకుడని చెప్పుకునే షబ్బీర్ అలీ ఇక్కడి నుంచే ఉన్నా.. కనీసం కమిషనర్ ను నియమించకపోవడాన్ని ప్రజల గమనించాలని అన్నారు. ఏడాదికాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదని , కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక కొత్త పని చేపట్టలేదని విమర్శించారు.
ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారని ధ్వజమెత్తారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ పై ఆలోచన లేదు, పట్టిలేదని, నిజామాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దందా జరుగుతోందని విమర్శించారు. ఇప్పుడు మైనింగ్ శాఖ ఆదాయం తగ్గింది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుకు దోపిడీని అడ్డుకుంటామని ప్రకటించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 3 లక్షల 79 మంది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఇంకా లక్షా 2 వేల మందికి, కామారెడ్ది జిల్లాలో 75 వేల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఈ రైతులకు త్వరగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తక్షణమే నిధులు విడుదల చేసి… వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కమిటీలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్ లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమని, బుల్డోజర్తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని ప్రస్తావించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, కాబట్టి ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే మేము ఊరుకోబోమని స్పష్టం చేశారు.