హైదరాబాద్ నగరంలో మురుగునీటి శుద్ధి కోసం కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందని, కొత్త ఎస్టీపీల నిర్మాణం కూడా పూర్తైతే పూర్తిస్థాయిలో మురుగునీటి శుద్ధి జరుగుతుందని అన్నారు. సోమవారం ప్రగతి భవన్లో జలమండలి ఎండీ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్.. జలమండలి చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఎస్టీపీలను విహార కేంద్రాలుగా తీర్చి దిద్దండి :
ఎస్టీపీలను పచ్చటి ఉద్యానవనాలుగా చక్కటి ఆహ్లాదకర వాతావరణంతో మార్చాలని కేటీఆర్ సూచించారు. ఎస్టీపీలను నగరవాసులకు విహార కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జలమండలి అధికారులకు సూచనలు చేశారు. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శివార్లపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఓఆర్ఆర్ అవతల కూడా జన సాంద్రత ఎక్కువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని నూతన ఎస్టీపీల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
ఏడాదిలో ఓఆర్ఆర్ – 2 ఏడాదిలో పూర్తి చేయండి :
ఓఆర్ఆర్ – 2లో భాగంగా చేపడుతున్న పనులను ఏడాదిలో పూర్తయ్యేలా చూడాలన్నారు. విస్తరించిన ఓఆర్ఆర్ గ్రామాల ప్రాంతాలకు నీటి సరఫరా, మౌలిక సదుపాయాలను అందించడం కోసం 1200 కోట్లతో వ్యయంతో ORR గ్రామాల ప్రాజెక్ట్ ఫేస్- II ను జలమండలి అధికారులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.