ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మోడీ ప్రభుత్వం మత విద్వేష రాజకీయాలకి తెరలేపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని, దేశంలోని అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి, భారమవుతున్న నిత్యవసరాల నుంచి, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టమని, ప్రజలు జాగరూకతతో ఉండాలని సూచించారు.
దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. హర్ ఘర్ జల్ ( ప్రతి ఇంటికి నీళ్లు) అన్నారు కానీ.. హర్ ఘర్ జహర్ (ప్రతి ఇంటికి విషం) అనీ.. హర్ దిల్ మేన్ జహార్ లాగ ప్రతి మనసులో మతమని విషాన్ని నింపడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం జరుగుతోందని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని.. సోషల్ ఫ్యాబ్రిక్ను దెబ్బతీసే కుతంత్రం మోదీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. కానీ ఇపుడు ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని ప్రజలు గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.