రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థిక భరోసాతో ఇంజనీరింగ్ చదివి, నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొందిన రుద్ర రచన విషయం మనకు విదితమే. కాగా తన ఇంజనీరింగ్ పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలుసుకొని, తను పొదుపు చేసుకున్న డబ్బులతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ చేతికి కట్టింది. ఈ సందర్భంగా రచన మాట్లాడిన మాటలకు, చూపిన అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. రచన జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతీ ప్రయత్నానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
రచన విజయం సాధించిన క్రమంలోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. స్థానిక బాలల సదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నది. ఆ తరువాత హైదరాబాద్ యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్లో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తిచేసింది. 2019లో ఈసెట్ ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఇంజినీరింగ్ సీటు సాధించింది. అయితే తల్లిదండ్రులు లేకపోవడం, ఫీజు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని అయోమయంలో సీబీఐటీలో వచ్చిన సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమెను ప్రగతిభవన్కు పిలిపించుకొని ఇంజినీరింగ్కు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ పూర్తిచేసిన రుద్ర రచన ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించింది.
కాగా తన ఇంజినీరింగ్ పూర్తయిన సందర్భంగా సోమవారం రుద్ర రచన ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలుసుకున్నారు. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకొని కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. రచన మాటలకు, అభిమానానికి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలను సవాల్గా స్వీకరించి నాలుగు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన రచన, యువతరానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న రచన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఫీజు, హాస్టల్ బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తం నగదు సహాయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ అందించారు.