mt_logo

విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానం… తలసరి విద్యుత్ వినియోగంలో కూడా

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఆవిర్భవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొంది. విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సమూల మార్పుల వల్లే ఈ విజయం సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధిక నిధులు కేటాయించారు. దీంతో అంచెలంచెలుగా అన్ని అడ్డంకులు అధిగమించి దేశంలోనే రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని అధికారులు తెలిపారు. 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం, 1,110 యూనిట్లు కాగా, ప్రస్తుతం 2,012 యూనిట్లకు పెరిగింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు ఉండగా, ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లకు చేరుకుంది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *