టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులంతా తీర్మానం చేసేలా మహేశ్ బిగాల చేసిన ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను మహేశ్ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు. వివిధ దేశాల ఎన్నారైలతో మహేశ్ బిగాల ఇటీవల ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రవాస భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మంత్రికి మహేశ్ బిగాల వివరించారు. రెండు వారాల యూరప్ పర్యటన విశేషాలను కేటీఆర్తో ఆయన పంచుకొన్నారు. యూరప్లోని రాష్టాల ప్రతినిధులను తాను కలిశానని, వారంతా సీఎం కేసీఆర్ జాతికి నాయకత్వం అందించాలనే ఆశాభావంతో ఉన్నారని మహేశ్ బిగాల మంత్రికి వివరించారు.