mt_logo

మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో మొట్ట మొదటి ‘ఉద్యామిక’ : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడి పెట్టే మహిళా పారిశ్రామిక వేత్తలకు 10 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌ని, వారు ఎద‌గ‌డానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల స‌హ‌కారం అందిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హ‌బ్ అని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటైన వీ హ‌బ్ ను మహిళలు సంద‌ర్శించి, పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి అన్నారు. వీ హ‌బ్ ఇప్ప‌టికే 2,194 స్టార్ట‌ప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసిందని, ఇందు కోసం ప్రభుత్వం నుండి 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. స్టార్ట‌ప్ నిధుల‌తో 2,800 మందికి ఉపాధి క‌ల్ప‌న సృష్టించామ‌ని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఉద్యామిక అనే కొత్త కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. వారి ఫిర్యాదుల‌ను కూడా ప‌రిష్క‌రిస్తున్నామ‌ని చెప్పారు. ఉద్యామిక‌లో భాగంగా సంప్ర‌దింపుల క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ క‌మిటీ ద్వారా ప్రాసెస్, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. సుల‌భ‌త‌ర వాణిజ్యానికి కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు కావాల‌న్నారు. ప్ర‌పంచ స్థాయి ఉత్ప‌త్తుల‌తో పురోభివృద్ధి సాధించాల‌ని ఆశిస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *