mt_logo

అన్నిట్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం : అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ధ్వజం

కేంద్రం తెలంగాణను అన్ని విధాలుగా బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ఎఫ్‌ఆర్‌బిఎంపై జరిగిన లఘు చర్చపై ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంఘం నివేదికలో కేంద్రం తన రుణాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనికోసం హైపవర్ ఇంటర్ గవర్నమెంట్ కమిటీ వేయాలని నివేదిక తెలిపిందని, కానీ కేంద్రం కమిటీ ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట సవరణ చేశారని మంత్రి సభకు వివరించారు.

కేంద్రం నిర్ణయం బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం అనే విధంగా ఉందని ఆయన విమర్శంచారు. కేంద్రం పెద్దమొత్తంలో అప్పులు తీసుకు వచ్చింది. అయితే తాము తీసుకున్న అప్పులను రికవరీలో పెట్టని కేంద్రం రాష్ట్రాలు అప్పు లు తీసుకుంటే మాత్రమ రెట్రాస్పెక్టి ఎఫెక్ట్‌తో రికవరి చేస్తామని బెదిరింపులకు దిగుతోందని మండి పడ్డారు. రాష్ట్రాల అప్పుల పరిమితిని తగ్గిస్తామని ఏక పక్షనిర్ణయానికి పాల్పడిందన్నారు. నీతి అనేది కేద్రాలకు రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలన్నారు. రెట్రాస్పెక్టివ్‌ను అమలు చేస్తూ రాష్టాల ఆర్దిక స్థితిగులను నష్టపరిచే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర జిఎస్‌డిపిలో 4 శాతం ఎఫ్‌ఆర్‌ఎం అనుమతి ఉంది, ఇందులో 0.5 శాతాన్ని వదులకున్నాం అన్నారు. తాము వదులకున్న 0.5 శాతం విలువ అక్షరాల రూ. 6104 కోట్లని 3.5 శాతంతో బడ్జెట్ రూపకల్పన చేసుకుని ఆమోదించుకున్నామన్నారు. శాసన సభలో బడ్జెట్ ఆమోదం పోందిన తర్వాత రెట్రాస్పెక్టివ్‌గా మీ బడ్జెట్‌లో కోత పెడతాం అంటే ఎలా ? అప్పటికే మేము ప్లాన్ చేసుకున్న బడ్జెట్‌ను ఎలా అమలు చేయగలమని ప్రశ్నించారు. ఆదే అంశాన్ని బడ్జెట్ ఆమోదం పొందక ముందు చెప్పాలి, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏక పక్షంగా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారని ఆయన కేంద్రంపై మండి పడ్డారు.

ఆర్దిక సంఘం అంటే ఒక బైబిల్, ఒక ఖరాన్, ఒక భగవద్గీత. గత ప్రభుత్వాలన్నీ వాటిని అమలు చేశాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 15వ ఆర్దిక సంఘం 2020-21కు గాను రూ.723 కోట్లు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని,పౌష్టిక ఆహారం కోసం రూ. 171కోట్లు , అదే విధంగా 202126 మద్య స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, సెంటర్ ,స్పెసిఫిక్ గ్రాంట్ల కింద రూ.5374 కోట్లు ఇవ్వాలని సూచించింది.మొత్తంగా 15వ ఆర్దిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి రూ. 6268 కోట్లు ఇవ్వాలని సూచించదన్నారు. రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలని ఆర్దిక సంఘం చెబితే పట్టించు కోరు రాష్ట్రాల రుణపరిమితులు తగ్గించాలంటే మాత్రం ఏక పక్షంగా తగ్గించి వేస్తారు… దేశ చరిత్రలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు ఇది మన దురదృష్టమని మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్దిక సంఘం సిఫార్స్ చేసిన రూ.817 కోట్లు ఇవ్వరు, మిషన్ భగీరథకు రూ.19205 కోట్లు, మిషన్ కాకతీయకురూ. 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర విదిలించిన పాపాన పోలేదని కేంద్ర వైఖరిని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. 201415 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపికి ఇచ్చారు. మాకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని ఎన్ని ఉత్తరాలు కేంద్రానికి రాసినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు కానీ రావాల్సిన రూ. 495 కోట్లను 8 సంవత్సరాలు దాటినా కేంద్రం ఇవ్వలేదన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రాష్ట్రాలకు ఇచ్చే నిధులను 32 శాతం నుంచి42 పెంచి మళ్ళీ సెస్‌ల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేశారాన్నరు. రాష్ట్రాలకు డబ్బు పంచొద్దు అని సెస్ రూపంలో ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేశారని ఆర్దిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సెస్సుల రూపంలో 2021-2022లో ఆదాయంలో 22.56 శాతం సమూర్చుకున్నది. 78 శాతానికి వచ్చే డబ్బులో మాత్రమే రాష్ట్రాలకు పంచారని, వాస్తవానికి రాష్ట్రానికి పన్నుల వాటా 29.6శాతం. చెప్పింది. 42 శాతం, ఇచ్చేది 29.6 శాతం, నిజంగా 42 శాతం రాష్ట్రానికి ఇస్తే రూ.33,712 కోట్లు తెలంగాణకు వస్తుండే. దాదాపు 12.4 శాతం నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు చేస్తే తాగు నీరు, విద్యుత్ ఇలా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేశామన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారింది. పండిన పంటలే దానికి సాక్షమని మంత్రి హరీష్ రావు చెప్పారు. దేశంలో ప్రతి ఇంటికి తాగు నీరు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన మిషన్ భగీరధ దేశానికే ఆదర్శంగా మారి హర్ ఘర్‌ల జల్ అయ్యిందన్నారు. ప్లోరైడ్ ప్రభావిత గ్రామాలు తెలంగాణలొ ఒక్కటి కూడా లేదని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో పీవీ నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ నుంచి వెళ్ళి వేడుకున్నారు. దశాబ్దాల సమస్యను గత ప్రభుత్వాలు పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.. కాని తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. ఓట్ల కోసం కాకుండా, ప్రజల కష్టాలు తెలిసిన నాయకునిగా ఇంటింటికి నీరు ఇచ్చి మాటను నిలుపుకున్నారు సీఎం కేసిఆర్ అన్నారు. కాళేశ్వరం మీద, మిషన్ భగీరీద మీద ఖర్చు చేసారు. కేంద్రం మాత్రం 2017-18లో రూ. 81 వేల కోట్లు, 2018-19లో లక్షా 58 వేల కోట్ల రూపాయల రెవెన్యూ కోసం ఔటాఫ్ బడ్జెట్ అప్పులు తీసుకున్నదని కాగ్ తప్పు పట్టింది. ఇదే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతి పైసా క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ మీద ఖర్చు చేసింది. గత ఐదారేళ్ళలో దాదాపు 6 లక్షల కోట్లు కేంద్ర ఎఫ్‌ఆర్‌బిఎం బయట డబ్బు తీసుకుందన్నారు.

సీఎం కేసిఆర్ కృషి,పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ వ్యయంతో పూర్తి చేసుకున్నామని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ భవిష్యత్ అవసరాల కోసం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం అన్నారు. 16 లక్షల ఎకరాలు ఉంటే 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచుకున్నామని తెలిపారు. కరువు వచ్చినా తాగు, సాగు నీరు పరిశ్రమల అవసరాల కోసం కొరత ఉండవద్దని ఇలా చేసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయక పోతే మరో లక్ష కోట్లు అవసరం అయ్యేది. సత్వర ఫలితాలు అందడం, వల్ల రైతుల ఆదాయం పెరిగింది. పండిన పంటే కళ్ళముందు సాక్ష్యమన్నారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అనే రోజుల నుంచి బీహర్ యూపీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వలస కూలీలు వస్తున్నారన్నారు. ఆర్‌బిఐ రిపోర్టు ప్రకారం పంజాబ్ నెం 1 అప్పులో ఉండగా తెలంగాణ 23.5 శాతం మాత్రమే ఉందన్నారు. తెలంగాణ పై నుంచి కిందకు 23వ వస్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చింది 3,65,797 కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 1,96,448 కోట్లు. ఇతర రాష్ట్రాల, దేశాన్ని సాకుతున్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రతి రూపాయిలో మనం 47 పైసలు దేశం కోసం ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం హక్కుగా రావాల్సిన డబ్బులు వచ్చి ఉంటే లక్ష కోట్లు అప్పు తీసుకురావాల్సి ఉండేది కాదన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎంలో కేంద్రానికి కూడా కోత పెట్టాలి. ఏక పక్షంగా రాష్ట్రానికి పెట్టిన కోతల వల్ల రూ.15033 కోట్లు బడ్జెట్‌లో ప్లాన్ చేసుకున్నదానికంటే తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిబంధన ఎత్తివేస్తే రూ.6104 కోట్లు వస్తాయి.

15వ ఆర్దిక సంతవ్సరం 202126 కోసం 5374 కోట్లు తెలంగాణకు ఇవ్వమని చెప్పిందన్నారు. 14వ ఆర్దిక సంఘం ద్వారా లోకల్‌బాడీస్ కోసం రూ.817 కోట్లు ఇప్పించాలని. పన్నుల్లో 41 శాతం వాటా ఇస్తే 33712 రావాలని వీటన్నిటిని ఇప్పించాలని బిజెపీ ఎమ్మెల్యే రఘునందన్‌ను ఉద్దేశించి అన్నారు. విద్యుత్ బకాయిలు ఏపీ నుంచి రూ.17828 కోట్లు రావాలి, 2014-15 రాష్ట్ర సిఎస్‌ఎస్ డబ్బులు తప్పుగా రూ.495 కోట్లు ఇప్పించారు. స్పెషల్ అసిస్టెంట్ గ్రాంట్ కింద ఇచ్చే రూ.1350 కోట్లు, నీతి ఆయోగ్ ప్రకారం మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, కాకతీయకు రూ 5 వేల కోట్లు ఇప్పించాలన్నారు. ఈ మొత్తం కలపితే లక్షా 5 వేల 812 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇవి ఇచ్చి ఉంటే తెలంగాణకు మిగులు ఉండేదని బిజెపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి మంత్రి హరీష్‌రావు అన్నారు. కేంద్రం చేసిన అప్పు ఒక కోటీ 52 లక్షల 17 వేల 910 కోట్లు. లెక్కిస్తే ఒక్క పౌరుడిపై రూ.12,5679 అప్పు ఉంటుందన్నారు.

ఎనిమిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సారాంశం, సఫలం సంక్షేమం, సామరస్యం అని మంత్రి హరీష్ రావు అన్నారు. అదే 8 సంవత్సరాల 8 మోడీ పరిపాలన సారాంశం, విఫలం, విషం, విద్వేషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్దిక వృద్ది రేటు 8.2 శాతం ఉండగా ఇప్పుడు 5.3 శాతానికి తగ్గింది. 2014 వరకు డాలర్‌తో రూపాయి మారక విలువ రూ.59.7 ఉండేదని, ప్రస్తుత ప్రధాన మంత్రి మోడి హాయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.80కి పడిపోయిందని దుయ్యబట్టారు. దీని వల్ల సామాన్య మద్యతరగతి ప్రజలపై భారం పడుతుందని, దిగుమతులపై తీవ్ర ఆర్దిక ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దేశ జీడీపీ పెరగం లేదు కాని గ్యాస్,డీజిల్,పెట్రోల్ ఈ జీడీపీ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర కనిష్ట స్థాయికి చేరుకుంది.కానీ మన దేశంలో పెట్రోల్, డిజిల్ ధరలు మాత్రం ససేమిరా తగ్గించమంటున్నారు. ఈ రోజు గ్యాస్ పోయ్యి మంట కన్నా గ్యాస్ ధర మంట ఎక్కువగా మండుతోందన్నారు.

విదేశాల నుంచి నల్ల ధనం తెస్తామన్నారు…ఫెయిల్, పేదల ఖాతాలో రూ.15 లక్షలు… ఫెయిల్, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు…ఫెయిల్, పెద్ద సంఖ్యలో నోట్ల రద్దు…ఫెయిల్, రైతుల ఆదాయం రెట్టింపు.. ఫెయిల్, ఎం.ఎస్.ఎం ఈలకు గంటలోపు రుణాలు…ఫెయిల్, అర్హుందరికి ఇండ్లు…ఫెయిల్, మేకిన్ ఇండియా…ఫెయిల్, పట్టిష్టమైన లోక్ పాల్ బిల్లు…ఫెయిల్, నదుల అనుసంధానం…పెయిల్, టెర్రరిజం కూకటి వేళ్ళలో పెకలిస్తాం..ఫెయిల్, బుల్లెట్ ట్రైన్…ఫెయిల్, హర్ ఘర్ జల్… ఫెయిల్, ఇలా అన్నింటిలో కేంద్ర విఫలమైందని మంత్రి హరీశరావు దుయ్యబట్టారు. ఏడు దశాబ్దాలకు పైగా దేశ ప్రజలు శ్రమించి సమకూర్చుకున్న ఆస్తులను వడ్డీకీ, పావుశేరు చొప్పున అమ్మివేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎనిమిది సంవత్సరాల్లో 23 ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మివేశారు. ఏపీ ప్రజలు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మి వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలపడాలని తెలంగాణ ప్రభుత్వం పలు ఆర్డర్లును బిహెచ్‌ఈఎల్‌కు ఇచ్చింది. అది మన సంస్కారం, మన దేశ భక్తి. అమ్మివేయడం, బిజెపీ మార్క్, బిజెపీ దేశ భక్తి . పాలిచ్చే ఆవును కోతకు అమ్మినట్లు దేశానికి బీమా సంస్కృతిని నేర్పిన ఎల్‌ఐసిని సైతం తెగనమ్ముతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *