శుక్రవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లోని టీఎస్ పార్డ్ ఆవరణలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీఎస్ పార్డ్ లో లక్ష మొక్కలు నాటాలని సంకల్పించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో భవిష్యత్ తరాలకు అత్యంత లాభదాయకమైంది హరితహారం పథకమని, బంగారు తెలంగాణలో పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కేటీఆర్ సూచించారు. మానవచరిత్రలో చైనా, బ్రెజిల్ తర్వాత ఇన్నికోట్ల మొక్కలు నాటడం ఇది మూడో అతిపెద్ద ప్రయత్నమని అన్నారు.
సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తే మరింత మందికి ప్రేరణను, ఉత్సాహాన్ని కల్పించవచ్చని, మీరు నాటే మొక్కతో ఫొటోను తీసుకోండని, ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా మరింత ప్రచారం తేవాలని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను నాటిన మొక్కతో మంత్రి సెల్ఫీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పంచాయితీ పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితారామచంద్రన్, టీఎస్ పార్డ్ జేడీ ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.