mt_logo

భారత్‌లో తొలి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తెలంగాణలో : మంత్రి కేటీఆర్

పెట్టుబడులకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎలెస్ట్ (రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌) డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి తన డిస్‌ప్లే ఫ్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల తయారీకి ఉపయోగించే అత్యాధునిక అమోలెడ్‌ డిస్‌ప్లేల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు ఎలెస్ట్‌ వెల్లడించింది.

ఈ మేరకు ఆ కంపెనీ ఆదివారం బెంగళూరులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. దీనిపై రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ నెలకొల్పే యూనిట్‌ ద్వారా దాదాపు 3 వేల మంది సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులకు ప్రత్యక్షంగా, అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి చెందిన అనుబంధ సంస్థలు, వేల మంది సరఫరాదారులకు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ డిస్‌ప్లే ఫ్యాబ్‌ కంపెనీలకు దీటుగా ఎలెస్ట్‌ హైదరాబాద్‌ యూనిట్‌లో 6వ తరం అమోలెడ్‌ డిస్‌ప్లేలను తయారు చేయనున్నది. మొదట నగర శివారులోని దుండిగల్‌లో 50 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండగా, ఆ తర్వాత మరో 300 ఎకరాల్లో అత్యంత ఆధునాతన తయారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో ఎలెస్ట్‌ నుంచి భారీ పెట్టుబడి రావడం తెలంగాణతోపాటు యావత్‌ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పెట్టుబడితో భారత్‌ అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో జపాన్‌, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన నిలుస్తుందని… ఇప్పటి వరకు జపాన్‌, కొరియా, తైవాన్‌కు మాత్రమే సాధ్యమైన అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ ఉత్పత్తులు ఇకపై తెలంగాణలోనూ తయారవుతాయని తెలిపారు. దేశంలో సెమీకండక్టర్‌ మిషన్‌ను ప్రకటించిన తర్వాత ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఎలెస్ట్‌ రాకతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌, ఐటీ ఎకో సిస్టం మరింత బలోపేతమై డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, తద్వారా అనుబంధ రంగాల అభివృద్ధికి గణనీయ అవకాశాలు ఏర్పడతాయని మంత్రి కేటీఆర్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపురి మాట్లాడుతూ… ఇప్పటివరకు భారత్‌లో ఎక్కడా లేని హైటెక్‌ మ్యాన్యుఫ్చాక్చరింగ్‌ కంపెనీ తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు కానున్నదని తెలిపారు. అమోలెడ్‌ డిస్‌ప్లేల తయారీ కోసం రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) కంపెనీ హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో యూనిట్‌ను నెలకొల్పనున్నరన్నారు. ఆరేండ్లలో ఈ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *