mt_logo

ఫార్ములా ఈ-రేస్‌కు వేదికవనున్న హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఫార్ములా ఈ-రేస్‌కు వేదికయ్యిందని ఐటి, పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఎంఏయూడి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ నుంచి మార్చి మధ్యలో ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని ఆయన తెలిపారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, ఫార్ములా ఈ-టీమ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే 90 రోజుల్లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వాహకులు ప్రకటించారు. సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ -రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుందని, నవంబర్ 22 నుంచి ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా ఈ-రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరగొచ్చని ఫార్మూలా ప్రతినిధులు తెలిపారు. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎంఓయూ సంతకాల కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడుతూ… ఈ ఒప్పందం సరికొత్త శకానికి నాందిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఈ -రేస్‌కు హోస్ట్‌గా నిలవనుందన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ స్పోర్ట్ త్వరలో హైదరాబాద్‌కు రానుందన్నారు. ఫార్ములావన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా హైదరాబాద్ ఎంపికయ్యిందన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ ఈవీ గమనంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

ఎలక్ట్రికల్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు :

ఈ సంవత్సరంలో ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో నగరంలో మూడురోజుల పాటు ఈవీ ఎక్స్‌పోను నిర్వహిస్తామన్నారు. తద్వారా ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లతో పాటు ఫెసిలిటీ గురించి కంపెనీలకు వివరిస్తామన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేలా రేస్ ఫార్ములా ఉందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో త్వరలో మొబిలిటీ క్లస్టర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు. కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అప్పుడే మెరుగైన భవిష్యత్ మన సొంతం అవుతుందన్నారు.

గ్రీన్ ఎనర్జీ దిశగా :

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు. సీతారాంపూర్, దివిటిపల్లిలో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని, ప్రపంచంలో నివాసయోగ్య నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.

దశలవారీగా ఈ-రేస్

ఈ మేరకు ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు ప్రమోటర్ గ్రీన్ కో గ్రూపు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో లెటర్ ఆఫ్ ఇంటెండ్‌ను మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 18 నగరాల్లో దశలవారీగా ఫార్ములా ఈ-రేస్ జరుగుతుండగా గ్లోబల్‌గా 60 నగరాలతో పోటీపడి మరీ హైదరాబాద్ ఈ రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా ఎంపిక కావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు పాటుపడుతున్న తెలంగాణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తో పాటు ఫార్ములా ఈ- అసోసియేషన్, గ్రీన్‌కో నాయకత్వ బృందం, ఐటి, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *