హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం మహాద్బుతమని కొనియాడారు. సోమవారం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రీశుణ్ణి దర్శించుకున్న బాలకృష్ణ.. ఆలయం మహాద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని ,ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అని, తాను చిన్నపాటి నుంచి యాదాద్రికి వస్తున్నానని కానీ ఇంత అద్భుతముగా ఆలయం అభివృద్ధి కావడం, ఈ ఆలయాన్ని తాను చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సు:ఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవించాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా మహమ్మరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రజలందరినీ కాపాడాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

