mt_logo

నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు

సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్‌లో గులాబీ జెండా ఎగరటం ఖాయం.. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అన్నారు.

బీజేపీ అభ్యర్థి మంచోడు అయితే దుబ్బాకలో గెలవాలి కదా.. పనితీరు బాగోలేదని 54 వేల ఓట్లతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. చింతా ప్రభాకర్‌ను గెలిపించినట్లుగా, వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి అని పిలుపునిచ్చారు. ఎంతో మంచి మనిషి, పేద పిల్లల కోసం రూ. 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.

రెండు లక్షల రుణమాఫీ అని మాట తప్పింది కాంగ్రెస్.. రైతుబంధు అన్ని మాట తప్పింది, బోనస్ అని మాట తప్పింది. పింఛన్లు ఇవ్వలేదు.. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలి అని అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి అని తెలిపారు.

చోటే భాయ్ రేవంత్ రెడ్డి బడే భాయ్ మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడు.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. ముస్లింలను క్యాబినెట్ మంత్రిగా ఏనాడూ తీసుకోలేదు కాంగ్రెస్.. కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని చేసారు. బడ్జెట్‌లో నిధుల కోత విధించారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ విమర్శించారు.

బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది.. వాళ్ళతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారు. ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా. నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో ఉండాలే అన్నట్టు ఉంది బీజేపీ వైఖరి అని అన్నారు.

కేజ్రీవాల్‌ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు బీజేపీతో కలిసేది లేదు.. మాది సెక్యూలర్ పార్టీ అని స్పష్టం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి మోసం చేశాయి. 154 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి మనకు ఇవ్వలేదు. కేసీఆర్ గారు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చారు. రెండు పార్టీలను చిత్తూగా ఓడించాలి అని హరీష్ అన్నారు.

రేవంత్ రెడ్డి హామీల అమలు మీద దృష్టి పెట్టాలి.. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అని తెలిపారు.