mt_logo

గులాబ్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

ఆదివారం రాత్రి నుండి మంగళవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన సీఎంల సమావేశంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ తో వెళ్లిన సోమేశ్ కుమార్ అక్కడి నుండే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాత్రి నుండి రెండు రోజుల పాటు గులాబ్ తూఫాన్ ప్రభావం రాష్ట్రం మొత్తంపై ఉన్నందున ప్రతీ జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణా జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణా జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ గా ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీస్ ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు, తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఎన్.డీ.ఆర్.ఎఫ్. సేవలను పొందాలని, ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలున్నాయని పేర్కొన్నారు. వరద నీరు ప్రవాహ సమయంలో వాగుల నుండి ప్రజలు దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణా చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. చెరువులు, పూర్తిగా  నిండిన జలాశయాల్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ, ముందు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *