తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పత్తికి రికార్డ్ ధర పలికింది. ఏకంగా క్వింటాల్కు 10వేల రూపాయలు పలికి అల్ టైం రికార్డ్ కు చేరింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎప్పుడూ లేనంతగా క్వింటాల్కు 10వేలకు చేరడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం పత్తి మార్కెట్ నందు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పత్తితో అభిషేకం నిర్వహించారు. పత్తితో మన రైతు బంధు కేసీఆర్ అని రాసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ లో సంబరాలు నిర్వహించారు. మంచి లాభసాటి ధర రావటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతు పెట్టుబడి సాయంతో నేడు వ్యవసాయం సాఫీగా చేసుకుంటున్నారని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి పత్తి దిగుబడి తక్కువ రావడంతో రేటు ఎక్కువ ఉంటుందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో భారతీయ నూలుకు అధిక డిమాండ్ ఉన్నందున ధర పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.