హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ వేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమిటీ నివేదిక రాగానే యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శనివారం నిర్వహించిన న్యాక్ 42వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. న్యాక్లో పలు బ్లాక్లను స్వయంగా పరిశీలించి, అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగ నియామకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు న్యాక్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గతేడాది 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. బీటెక్ చదివిన వారికి న్యాక్ ఆధ్వర్యంలో ఒక ఏడాది పీజీ విద్యను అందించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇక ఇక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్లాబ్ పెంచుతూ..
రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.