ఈ నెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన సభ పేరుతొ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టిన నీచుడు రాజగోపాల్ రెడ్డి అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసింది, ఇంకా చేస్తూనే ఉందని, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.