తొమ్మిదేండ్ల నుండి తమ బిడ్డకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల కల ఫలించింది. వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆడపిల్లకు పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎంఎల్సి మధుసూధనాచారి చొరవ తీసుకుని, తల్లిదండ్రులను బిడ్డను ఆదివారం ప్రగతి భవన్కు తీసుకు వచ్చారు.
విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు. అలాగే మహతి చదువుకోసం ఆర్థిక సాయాన్ని అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను కేసీఆర్ దంపతులు ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు మనస్పూర్తిగా కృతజ్జతలు తెలుపుకున్నారు.