mt_logo

నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు. 12:35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకుంటారు. 12:40 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12:55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, ఒంటి గంటకు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1:15కు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 3:10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్‌ను అందంగా ముస్తాబు చేశారు. బహిరంగ సభా స్థలి వద్ద బారికేడ్లు, వేదిక ఏర్పాటు చేశారు. 

సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లను మంత్రు లు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం సభకు సుమారు 2 లక్షల మంది తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీరి వెంట ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *