సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ శాలిని మిశ్రా, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టామని, ఈ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయం కావాలని అన్నారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యావత్ దేశం ఎంతో ఆసక్తితో గమనిస్తున్నదని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాకు, కరువు పీడిత పాలమూరు జిల్లాకు ముందు నీరు అందించాలని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. పథకాన్ని వేగవంతం చేయాలని, టెండర్ల ప్రక్రియను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం కోసం అనేక సంస్థలు ఇప్పటికే నిధులు సమకూర్చుతున్నాయని, హడ్కో, నాబార్డు నుండి రూ. 13వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, అంతేకాకుండా ఈ సంస్థలే మరో రూ. 7వేల కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా కొంతవరకు నిధులు అందుతాయని, అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఈ ప్రాజెక్టు కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని, పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు.