mt_logo

‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత రామచంద్రయ్యకు ఇంటిస్థలం, కోటిరూపాయల రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుల కోసం కోటి రూపాయల నజరానా ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో రామచంద్రయ్య మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పొందడం పట్ల శుభాకాంక్షలు అందించిన సీఎం కేసీఆర్, అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక డోలి కళను బతికిస్తున్నందుకు రామచంద్రయ్యను అభినందించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రామచంద్రయ్య స్థానిక జిల్లా కొత్తగూడెంలో ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే గత ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *