తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన మొదటిరోజే విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. సోమవారం శాండియాగో లోని కేమ్ వేద సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ ప్రతినిధులు జరిపిన సమావేశం అనంతరం ఒప్పంద నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్కు తెలిపింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్… తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని అనుకూలనాలు ఉన్నాయని, అలాగే పారదర్శక అనుమతులు త్వరతగతిన మంజూరు చేస్తున్నామని తెలిపారు. 150 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చిన కెమ్ వేద సంస్థకు ధన్యవాదాలు తెలుయజేశారు.

