గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ కాల్అవే సంస్థ హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ బ్రాండ్స్ ఒడిసి, ట్రవిస్ మాథ్యూ, ఓజియో, జాక్ వోల్ఫ్ స్కిన్ లను కలిగి ఉన్న కాల్అవే వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. ఈ డిజిటెక్ సెంటర్తో గోల్ఫ్ క్రీడకు సంబందించిన డేటా అనలిటిక్స్ తో పాటు తన గ్లోబల్ కార్యకలాపాలకు సపోర్టును, టెక్ సొల్యూషన్స్ను అందించేందుకు ఈ డిజిటెక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ డిజిటెక్ సెంటర్తో గోల్ఫ్ ఆటగాళ్ల ఆటతీరుతో సహా వారి క్రీడా నైపుణ్యం, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఎదురయ్యే అనేక సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను తమ కంపెనీ సూచిస్తుందని తెలిపింది. లాస్ ఏంజలెస్కి దగ్గరలో ఉన్న కాల్స్ బాద్ నగరంలో మంత్రి కేటీఆర్, కాల్వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సిఎఫ్వో బ్రయన్ లించ్, సిఐవో సాయి కూరపాటి లతో సమావేశం అయ్యారు. అమెరికా తర్వాత హైదరాబాద్లో ఏర్పాటుచేయబోయే సెంటరే అతి పెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఉపాధి దొరుకుతుందన్నారు. పెట్టుబడికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామని కాల్అవే ప్రతినిధులు ప్రకటించారు.
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లతో పాటు ఐటి,టెక్ కేంద్రాలను అనేక కంపెనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. గోల్ఫ్ క్రీడ ఆధారిత వినూత్న టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం పట్ల కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫార్మా, ఐటి రంగాల టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాదులో ఉన్నాయన్నారు. కాల్అవే కంపెనీ ప్రకటన తర్వాత అనేక ఇతర క్రీడలకు సంబంధించిన టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాద్లో ఏర్పాటు అవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా టూరిజం, క్రీడా అగ్రి తయారీ వంటి అంశాలపై కూడా చర్చించారు. ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్ లో తమ కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు కెటిఆర్కు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మరియు చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం తదితరులు పాల్గొన్నారు.