mt_logo

ఉద్యోగ నియామకాల ప్రకటనపై విష ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగ నియామకాల ప్రకటనపై బీజేపీ నాయకులు విషప్రచారం మొదలు పెట్టారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగితే తెలంగాణ ప్రజానీకంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని అభిమానం, సానుభూతి పెరుగుతాయని, దానిని జీర్ణించుకోలేక సీఎం ప్రకటనపై బిజేపి నాయకులు విషం చిమ్ముతున్నారని కొందరు తెరాస నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్లను జారీ చేసిన తర్వాత ఏవో కొన్ని లేని లొసుగులను లేవనెత్తి, సరికొత్త వివాదాలకు తెరతీసి ఎలాగైనా పోస్టుల భర్తీని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని బిజేపి నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

బిస్వాల్ కమిటీ సిఫారసుల మేరకు పోస్టులను భర్తీ చేయాలని, సుమారు ఒక లక్షా 90 వేల పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే బి.జే.పి.నాయకులు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే ఆ పార్టీ నియామకాల ప్రక్రియను నిర్వీర్యం చేయాలనే కుట్ర ఉందనే అనుమానాలకు తావిస్తోంది. నీళ్ళు& నిధులు& నియామకాల నినాదాన్ని పరిపూర్ణం చేసినట్లుగా తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడర్, నిరుద్యోగులు, విద్యార్ధి లోకం సంబరపడిపోతున్న ఈ పరిస్థితుల్లో బి.జే.పి. నాయకులు అక్కసుతో, ఓర్వలేక చేస్తున్న విమర్శలు పలు అనుమానాలకు దారి తీస్తోంది. 80వేల 39 పోస్టులను కొత్తగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయడం, వీటితోపాటుగా 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడమనే భారీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే టి.ఆర్.ఎస్. నినాదం పరిపూర్ణమవుతుందని, అదే ఇప్పుడు బి.జే.పి.అక్కసు వెళ్ళగక్కడానికి ప్రధాన కారణమని ఆ నేతలు అంటున్నారు. నోటిఫికేషన్‌లలో సాంకేతికపరమైన అంశాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని వివాదాస్పదం చేయడానికి, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే నిర్ణయంలో గెజిటెడ్ హోదాలోని వారిని నేరుగా రెగ్యులరైజ్ చేయకూడదనే చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ రెగ్యులరైజ్ చేసే ప్రక్రియకు బ్రేకులు వేస్తారేమోనని కొందరు పార్టీ లీడర్లు అంటున్నారు. అంతేగాక కొత్తగా నియామకాలు చేసే పోస్టులకు బడ్జెట్ కేటాయింపులు కూడా జరపలేదని బి.జే.పి.నేతలు విమర్శించడాన్ని చూస్తుంటే ఈ అంశాన్ని కూడా వివాదాస్పదం చేస్తారేనని టి.ఆర్.ఎస్. నేతలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఎటొచ్చీ ఈ నియామకాలు జరిగితే రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. పార్టీకి జనం నీరాజనాలు పలుకుతారని, ఎలాగైనా టి.ఆర్.ఎస్.కు ఇబ్బందులు సృష్టించాలనే బి.జే.పి.చేసే కుట్రలు, కుతంత్రాలను పసిగట్టి సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ఆ నాయకులు ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. పైగా బి.జే.పి. నాయకులకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అవసరమైన పలుకుబడి కూడా ఉందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆ నేతలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *