mt_logo

సీసీఐ పునరుద్ధరణ కోసం ఇక ఉద్యమమే… : మంత్రి కేటీఆర్

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు అదిలాబాద్ నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిసి కంపెనీ పునఃప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునఃప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీసీఐ పునప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం మేము ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేవేసేందుకు కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్లోని సీసీఐ పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని, కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ లోని సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత మాకు ఉందన్నారు. మరోవైపు జిల్లాకు సిరుల వరప్రధాయిని అయిన సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు.

సీసీఐ విషయంలో అవసరమైతే అదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఆదిలాబాద్ కు ఐటీ టవర్ ను మంజూరు చేస్తామని, దీంతో పాటు టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సీసీఐ ఏర్పాటు కోసం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రి కేటీఆర్ కి జిల్లా నాయకత్వం తెలిపింది. ఈ విషయంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ విషయంలో అదిలాబాద్ కి చెందిన బీజేపీ ఎంపీని కేంద్ర ప్రభుత్వం పైన సీసీఐ పునరుద్ధరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని నిలదీస్తామన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేయడం పట్ల ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *