దేశంలో అడ్డగోలుగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి హుజురాబాద్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆప్ ఓట్ కర్నే కే లియే జా రహే హైనా.. జరా గ్యాస్ సిలిండర్ కో నమస్కార్ కర్కే జావో’.. అంటూ మైకులో ప్రజలకు మోదీ పిలుపునిచ్చారని, అపుడు గ్యాస్ సిలిండర్ ధర కేవలం 410 రూపాయలు మాత్రమే ఉండేదని, ఆ ధరే ఎక్కువంటూ మోదీ తెగ బాధపడిపోయారన్నారు. మరిపుడు గ్యాస్ ధర రూ.వెయ్యి దగ్గర్లోకి చేరింది. ఇప్పుడు ఓటర్లు సిలిండర్కు ఎన్ని దండాలు పెట్టాలని మంత్రి కేటీఆర్ మోదీని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నాటి మోదీ వీడియోక్లిప్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేస్తూ.. ‘ఒక్కోసారి ఉత్తమ సలహాలు అనూహ్య ప్రాంతాల నుంచి వెలువడుతాయి. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ప్రజలు ఎన్నికల రోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కు నమస్తే పెట్టి ఓటేయాలంటూ సాక్షాత్తూ ఈ దేశ ప్రధాని ఇచ్చిన పిలుపును స్వీకరించి.. సిలిండర్కు దండంపెట్టి పోలింగ్బూత్కు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాల’ని ఓటర్లను కోరుతున్నానని అన్నారు.

