టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళా-ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మేమందరం ఉన్నది మీకు సేవ చేయడానికేనని, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాన్ని త్వరలో రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షలమందికి పెన్షన్లు ఇస్తున్నామని, మనిషికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి తెలిపారు.
గ్రామ పంచాయితీలకు 50 శాతం వరకు నిధులు ఖర్చు చేసుకునేలా త్వరలో జీవో తీసుకొస్తామని, గౌరవంగా ఉండాలనే స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ గౌరవ వేతనం పెంచారన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రప్రభుత్వం మెచ్చుకుందని మంత్రి అన్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.