వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈనెల 17న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించనున్నారు. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రి చొప్పున నియమించిన విషయం తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా టీఆర్ఎస్ కార్యకర్తలంతా ప్రతి గ్రామాన్ని చుట్టివచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
16 నెలల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనే ప్రచారాస్త్రాలుగా ఉండేలా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా ప్రణాళికలు రూపొందించారు. ఇదిలాఉండగా వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి పసునూరి దయాకర్ ఈరోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అనంతరం హన్మకొండ బాలసముద్రం లోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటి గంటకు మహా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బీ వినోద్ కుమార్, సీతారాం నాయక్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.