mt_logo

పార్లమెంట్ లో నాలుగోరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్ల‌మెంట్‌లో నాలుగో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగింది. గురువారం లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు.. స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టి, ప్ల‌కార్డులతో కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లి రైతుల‌ను కాపాడాలని, ధాన్యం సేక‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించి, మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్యసభలో 12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్ష నేతలతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టగా.. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాల్లో హంగామా సృష్టిస్తూ అదే విషయంపై పార్లమెంట్లో పదం కూడా పలకారా? అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీల ద్వంద వైఖరిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఇబ్బందులు, పంట కొనుగోలుకు సంబంధించిన సమస్యను ఈనెల 28న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ముందస్తుగా జరిగిన అఖిల పక్షం సమావేశంలో చెప్పామన్నారు. ముందస్తుగానే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా, పార్లమెంట్లో రైతు సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, మైక్ కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని భావిస్తే, కేంద్రం దానిపై కూడా దృష్టి సారించడం లేదన్నారు. ప్రతిరోజూ అటు లోక్ సభలో.. ఇటు రాజ్యసభలో అందరూ ఎంపీలం ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. ఇరు సభల్లో ఏదో ఒక్క సభలో అయినా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక పక్క పండించిన ధాన్యం కొనక, మరొక పక్క రాబోయే కాలంలో ఏ పంట వేయాలో తెలియక తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పంట కొనుగోలుపై ఒక్కొ బీజేపీ నేత ఒక్కో విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతుల పక్షాన మాట్లాడినందుకు మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు. పండించిన పంటను కొనకపోవడం, కావాల్సినన్ని రైల్వే ర్యాక్లను ఏర్పాటు చేయకపోవడం, ఎఫ్సీఐ కావాల్సిన మానవ వనరులను అందించడంలోనూ వివక్ష చూపిస్తున్నారన్నారు. ఏడు సంవత్సరాలలో నీళ్లు ఇచ్చి, కరెంటు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతు సోదరులకు న్యాయం జరిగే విషయంలో ప్రతి ఒక్కరూ తమతో కలిసి వచ్చి పోరాటానికి మద్దతు తెలపాలన్నారు. వారికి న్యాయం చేకూరేంత వరకు పోరాటం ఆపేది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఎందుకంటే, ధాన్యం సేకరించే బాధ్యత కేంద్రానిదే అని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *