Mission Telangana

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది- ఎంపీ జితేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా పార్లమెంట్ రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలను చేపట్టింది. ఈ సమావేశాల్లో భాగంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కృషిని ప్రశంసిస్తూ సభ్యులు ఈరోజు పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగంపై వ్యాఖ్యానిస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టగా, దీనిపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారనడం సరికాదని, తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారని గుర్తు చేశారు.

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది.. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమే.. వరంగల్ ఉప ఎన్నికలు మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని భారీ మెజారిటీతో ప్రజలు ఆమోదించారని అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని, అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *