mt_logo

పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రుల బృందం

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించింది. అలాగే జిల్లాల వారీగా, పంటల వారీగా జరిగిన నష్టాలను సమగ్రంగా అంచనా వేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఆకస్మిక వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించి… ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా నిలిచి అదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దయాకర్ రావు రైతులకు హామి ఇచ్చి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అందించిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 50 వేల ఎకరాలకు పైగానే పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నష్టం ఇంకా అధికంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరిత్యాల ప్రభాంతో పంటలు దెబ్బతింటే జరిగిన నష్టం 33 శాతానికి మించితేనే అటువంటి పంటలకు నష్టం జరిగినట్టు అధికారులు నమోదు చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటే అవి తిరిగి కోలుకునే అవకాశాలు ఉంటాయని అటువంటి వాటిని పంట నష్టాల జాబితాలో చేర్చబోమని అధికారులు వెల్లడించారు. అధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42వేల ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, పసుపు, తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లగా, అందులో 10వేల ఎకరాల్లో మిరప పంట ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పండ్ల తోటలకు కూడా భారీగానే నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న, ఉల్లి, ఆముదం, ఆవాలు, ఎర్రజోన్న తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన జిల్లాలతో కలిపి మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికలు ప్రభుత్వానికి అందజేయనున్నారు.

పంటనష్టాలపై ప్రభుత్వం భరోసా :

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. అన్ని జిల్లాల నుంచి పంట నష్టాలపై సమగ్ర నివేదికలు అందిన తర్వాత జరిగిన నష్టం ఎంత అన్నది తేల్చనున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఏవిధంగా ఆదుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏవిధమైన సాయం అందించాలి, ఏ రూపంలో సాయం అందించాలి, తద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత అన్నదానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక నిర్ణయానికి రానుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *