mt_logo

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు!

By: కట్టా శేఖర్ రెడ్డి 

మమ్మల్ని దూరం చేసినందుకు…
మిమ్మల్ని మీరు బయటపెట్టుకున్నందుకు…
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు!
అన్ని విధాలా స్పష్టత ఇచ్చినందుకు…
అన్ని ముసుగులు తీసేసినందుకు…
తెలంగాణతో తెగదెంపులు చేసుకున్నందుకు…
సీమాంధ్ర ముఖ్యమంత్రినని చాటుకున్నందుకు…
తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని, ధిక్కారాన్ని దాచుకోనందుకు…
సమైక్యతలోని డొల్లతనాన్ని బద్దలు కొట్టినందుకు…


ఇంకా ఎవరికీ ఎటువంటి భ్రమలు ఉండనక్కరలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టతతో రాష్ట్రంలో రాజకీయ విభజన కూడా జరిగిపోయింది. ఇప్పుడాయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రి. సీమాంధ్ర ఉద్యమ ప్రతినిధి. తొమ్మిది రోజుల తర్వాత మౌనం వీడిన ముఖ్యమంత్రి అక్కడ ఉద్యమాన్ని ఉపశమింపజేయడానికి మాట్లాడలేదు. మరింత రాజేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. హైదరాబాద్‌లో అంతఃకలహాలను రెచ్చగొట్టడానికి పాటుపడ్డారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై ఆనందంతో కొందరు యువకులు ఆ రాత్రి ఈ మహానగరంలో బాణాసంచా కాల్చారు. ఆనందతాండవం చేశారు. పర్వాలేదు. అయినా తెలంగాణ రెచ్చిపోదు. రెచ్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమం పన్నెండేళ్లుగా సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు చిక్కకుండా శాంతంగా ఇక్కడిదాకా వచ్చింది. హింసదారి పడితే ఎప్పుడో దీనిని తొక్కేసేవారు. ప్రజాస్వామ్య పంథానే ఇవ్వాళ మనకు తెలంగాణ సాధించిపెట్టింది. తెలంగాణ సాధనలోని బలమూ, గొప్పతనమూ అదే. ప్రజాస్వామ్య పంథాను వమ్ముచేయడానికి ఆధిపత్య శక్తులు ఎప్పుడూ కాచుకునే ఉంటాయి. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై అవాకులు చెవాకులు పేలిన ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడేదో ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నట్టు పోజు పెడుతున్నారు. పెట్టుకోనివ్వండి. తెలంగాణమాత్రం సహనం కోల్పోరాదు.

ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయనకు తెలియక కాదు. ఆయన నిద్ర నటిస్తున్నారు. బుకాయిస్తున్నారు. దబాయిస్తున్నారు. సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కేవలం కాంగ్రెస్ పార్టీదేనా? డిసెంబరు 2009లో కేంద్ర హోంమంత్రి చిదంబరం, కేంద్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దానిని ఆరోజు వమ్ముచేసింది సీమాంధ్ర ఆధిపత్యమే. ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి ఘాతుకానికే సీమాంధ్ర నాయకత్వం పాల్పడుతున్నది. ఆయన కేవలం ‘పంపకాల సంగతి తేల్చండి’ అని అడగడం లేదు. ‘తొందరపడి విభజిస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయి. సందేహాలు తీర్చకుండా ఎలా విభజిస్తారు?’ అని ఎదురుతిరుగుతున్నారు. సీమాంధ్ర ఉద్యమకారులతో గొంతుకలిపి మాట్లాడుతున్నారు. సీమాంధ్ర ఉద్యమనాయకునిగా మాట్లాడుతున్నారు. పంపకాలు, విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించకుండా విభజన జరుగదు. ఆ అంశాలు కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగితేనే కేంద్రం చేస్తుందా? కేంద్రం అవన్నీ ఆలోచించకుండానే విభజన ప్రక్రియ ప్రారంభించిందా? తొలుత యూపీఏ సమన్వయ కమిటీ, తర్వాత సీడబ్ల్యూసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్టు చెప్పారు. కేబినెట్ నోట్ తయారవుతున్నట్టు, త్వరలో అది కేంద్ర మంత్రివర్గం ముందుకు రానున్నట్టు చెప్పారు. కానీ సీఎం ఈ పరిణామాలను గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. సాధారణంగా విభజన నిర్ణయం తర్వాతనే పంపకాల సంగతి ముందుకు వస్తుంది. ఏ రాష్ట్రం విభజన సందర్భంగానయినా, ఎప్పుడయినా జరిగింది, జరిగేది ఇదే. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరుగుతుంది.

ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారు? సాగునీటి వివాదాలు వస్తాయట. ఇప్పుడు వివాదాలు లేవా? శ్రీశైలం నీటిని వదలొద్దని రాయలసీమ, సాగర్ నీటిని కిందకు విడవొద్దని తెలంగాణ, రెంటినీ విడుదల చేయాలని ఆంధ్ర ప్రతి కరువు సంవత్సరంలోనూ గొడవ పడడం లేదా? ఆ గొడవలు జరుగకుండా మీరేమైనా ఉద్ధరించారా? ఇప్పుడు రాష్ట్ర విభజనకు మూలం సాగునీటి వివాదాలే కాదా? తెలంగాణకు రావలసిన వాటా జలాలు ఇవ్వకపోవడమే కాదా? తెలంగాణను ఎండబెట్టి అక్రమంగా, ఏ అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు ద్వారా వందకు పైగా టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నందుకు కాదా? రాజోలిబండ మళ్లింపు కాలువ నీటిని కొల్లగొట్టినందుకు కాదా? గోదావరిపై గత నలభై ఏళ్లుగా ఒక్క కొత్త ప్రాజెక్టును కూడాపూర్తిచేయకపోయినందుకు కాదా? ఇచ్చంపల్లిని ఎగ్గొట్టి పోలవరానికి బాటలు వేసుకుంటున్నందుకు కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సమస్యతో అతలాకుతలమవుతుందని ముఖ్యమంత్రి బాధపడిపోతున్నారు. అయ్యా! మీరు బాగు చేయడం వద్దు. మీరు బాధపడిపోవడమూ వద్దు. ఇప్పుడు తెలంగాణను ఏం బాగు చేశారని? ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారని? అర్ధరాత్రి అపరాత్రి మీరిచ్చే ఆ కొద్ది గంటల విద్యుత్తుకు ఎన్నివందల మంది రైతులు బలయ్యారని? తెలంగాణలో ప్రారంభించాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు మూలుగుతున్నాయి. నేదునూరు, శంకర్‌పల్లి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకు ఒక ప్రొటెక్టివ్ విద్యుత్ ప్లాంటు లేదు. ఎండాకాలం వస్తే హైదరాబాద్‌లో కోతలు పెట్టాల్సిందే. పరిశ్రమలు మూతపడాల్సిందే. కార్మికులు వీధిన పడాల్సిందే. హైదరాబాద్‌లో తమరు చేసిన అభివృద్ధి ఇది. ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రా ప్రాంతానికే తరలించుకపోయారు. సముద్రతీరమంతా కమ్మేశారు. ఇక్కడ గోదావరి వెంట నీరుంది, బొగ్గుంది. విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉంది. అయినా పట్టించుకున్నారా? అందువల్ల ముఖ్యమంత్రిగారూ, ఇప్పుడు తెలంగాణ గురించి మీరేమీ బాధపడవద్దు. ఆ బాధలేవో మేం పడతాం. మా బాగోగులేవో మేం చూసుకుంటాం. తమరి హృదయం ఎక్కడున్నదో బయటపెట్టినందుకు మళ్లీ మళ్లీ ధన్యవాదాలు.

ముఖ్యమంత్రి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒక్క ముఖ్యమంత్రే కాదు సీమాంధ్ర పార్టీలు, మీడియా అంతా ఎందుకింత అక్కసునూ, ఆక్రోశాన్నీ బయటపెట్టుకుంటున్నాయి. సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి భయపడా లేక సీమాంధ్ర ప్రజలను మరింత రెచ్చగొట్టడానికా? రెండవదే నిజం. సీమాంధ్ర ప్రజల్లో విభజనపై భయాందోళనలు, అనుమానాలు ఉండడం సహజం. హైదరాబాద్‌తో అనుబంధం తెగిపోతుందన్న బాధ కూడా అర్థం చేసుకోవచ్చు. అయినా మొదటి మూడు రోజులు ఉద్యమాల్లో ప్రజలు పెద్దగా పాల్గొనలేదు. అక్కడక్కడా యూనివర్సిటీ కేంద్రాల్లో, ఉద్యోగుల్లో మాత్రమే కొంత అలజడి చెలరేగింది. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు కూడా విభజనకు అనుకూలంగా ట్యూన్ అవుతున్నారు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ఎవరూ రాజీనామాలు చేయలేదు. కానీ సీమాంధ్ర మీడియా ఇది చూసి రెచ్చిపోయింది. ‘రాష్ట్రం, హైదరాబాద్ నగరం చేజారిపోతుంటే సీమాంధ్ర నాయకులు సిగ్గూ శరం లేకుండా పదవుల్లో కులుకుతున్నారని, హైదరాబాద్ విదేశమవుతుందని, సీమాంధ్ర నేతల చేతగానితనం, అసమర్థత కారణంగానే విభజన నిర్ణయం జరిగిపోయిందని, హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజల జీవితాలను గాలికి వదిలేశారని, తెలంగాణ ఏర్పడితే కృష్ణా, గోదావరి నదుల్లో చుక్కనీరు కిందికి రాదని, కృష్ణా గోదావరి డెల్టాలు ఎడారులవుతాయని’….ఇలా సవాలక్ష అబద్ధాలను సీమాంధ్ర మీడియా అచ్చోసి జనం మీదికి వదిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల హైదరాబాద్‌ను ఏకంగా పాకిస్తాన్‌తో పోల్చింది. తండ్రికి తగ్గ తనయ. అంతకంటే భిన్నంగా మాట్లాడే అవకాశం లేదు. తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడ వెనుకబడిపోతామో అని రాజీనామాలు మొదలుపెట్టారు. అసలే ఆందోళనతో ఉన్న ప్రజల్లో ఈ చానెళ్లు, ఈ పార్టీలూ మరింత ఆజ్యం పోశాయి. అది పెరుగుతూ వచ్చింది. అనేక వికృత వేషాలకు దారితీసింది. ఇందులో అక్కడి ప్రజలను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. ఇంకొకడు హైదరాబాద్ పాలస్తీనా అవుతుందని బెదిరించాడు, తానొక యూదు అయినట్టు. ఇదంతా రాజకీయ పార్టీలు, సీమాంధ్ర మీడియా దివాలాకోరుతనం. ఏ ప్రజాస్వామిక విలువలకూ కట్టుబడని ఆధిపత్య విధ్వంసక బరితెగింపు. అవకాశవాద దుర్మార్గం. ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేని అసమర్థత. క్లిష్ట సమయాల్లో గాలికి కొట్టుకుపోయేవాడు నాయకుడు కాదు. ధీరుడూ కాదు. అపవాదులు భరించి అయినా జనాన్ని తనమార్గంలోకి తెచ్చుకోగలిగినవాడు నాయకుడు. తెలంగాణ నాయకత్వం ఆ విషయంలో విజయవంతమైంది. సీమాంధ్ర నాయకత్వం విఫలమైంది.

కాంగ్రెస్ అధిష్ఠానం కిరణ్‌కుమార్‌రెడ్డి మహానాయకుడని ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టలేదు. వరుస ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయినా, పార్టీ మారే ఎమ్మెల్యేలను అదుపు చేయలేకపోయినా, తెలంగాణ, సీమాంధ్రలలో పార్టీ ప్రతిష్ఠను ఇసుమంతయినా పునరుద్ధరించలేకపోయినా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదరిపోయి మాట్లాడుతుంటే నియంత్రించలేకపోయినా అధిష్ఠానం ఆయనను భరిస్తూ వచ్చింది. అందుకు కారణం ఆయన విధేయుడుగా ఉంటాడని మాత్రమే. కానీ అధిష్ఠానం అంచనా తప్పని ఆయన రుజువు చేశారు. ఇక ఇప్పుడు చొరవ తీసుకోవాల్సిందీ, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాల్సింది కాంగ్రెస్ అధిష్ఠానమే. అధిష్ఠానం ఇప్పుడు కూడా మౌనం వహిస్తే మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఒడిగడుతున్నదని అర్థం. అధిష్ఠానానికి తెలిసే కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా మాట్లాడారని అనుకోవలసి వస్తుంది. అధిష్ఠానం ఆశీస్సులతోనే పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు రెచ్చిపోతున్నారని అనుకోవలసి వస్తుంది. తెలంగాణకు వచ్చిన ఇబ్బందేం లేదు. ఎప్పటికయినా సాధించుకుని తీరతాం. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య రాజకీయ విభజన, మానసిక విభజన జరిగిపోయాయి. దానిని కిరణ్‌కుమార్‌రెడ్డి సంపూర్ణం చేశారు. ఇక చట్టం చేయడం ఒక్కటే మిగిలి ఉంది. ప్రజాస్వామ్యం ఎప్పుడో ఒకప్పుడు విజయం సాధించకపోదు. పార్లమెంటు తన విచక్షణాధికారాలను వినియోగించకపోదు. అవి కూడా విఫలమైతే పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.

Source: http://kattashekar.wordpress.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *