mt_logo

“తెలంగాణ టూరిజం” అంబాసిడర్ గా TeNF..

యూకే-యూరప్‌లో “తెలంగాణ టూరిజం” అంబాసిడర్ గా తెలంగాణ ఎన్నారై ఫోరమ్(TeNF)- లండన్ సమావేశంలో తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం ప్రకటన..

తెలంగాణ టూరిజం శాఖ మరియు తెలంగాణ ఎన్నారై ఫోరమ్(TeNF) సంయుక్తంగా లండన్‌లో “తెలంగాణ టూరిజం అభివృద్ధి- ఎన్నారైల పాత్ర” సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులతో పాటు, స్థానిక ట్రావెల్ ఏజెంట్స్, ప్రవాస తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

ముందుగా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సంస్థ(TeNF), రాష్ట్ర ఆవిర్భావంకి ముందు ఉద్యమ ప్రస్థానం, తరువాత బంగారు తెలంగాణకై చేస్తున్న కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి అతిథులకు వివరించారు.

వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భావం నుండి నేటివరకు చేపట్టిన కార్యక్రమాల గురించి, అలాగే సంస్థ విజన్‌ని, భవిష్యత్తు కార్యాచరణను సభకు వివరించారు. బాధ్యత గల తెలంగాణ సంస్థగా ప్రతి వేదికపై నూతన రాష్ట్రాన్ని మార్కెట్ చేస్తున్నామని, అలాంటిది నేడు తెలంగాణ టూరిజం లాంటి ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, అధికారికంగా ఎన్నో ప్రపంచ వేదికల్లో తెలంగాణ ప్రాముఖ్యతను వివరించగలమని, తద్వారా, తెలంగాణ రాష్ట్రానికి పర్యాటకులను పెంచుకొనే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, అందివచ్చిన అన్ని వేదికలను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మార్కెట్ చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిగా ఉందని ప్రశంసించారు. కొన్నిరోజుల ముందు పార్లమెంట్ లో జరిగిన బిజినెస్ మీట్ లో తెలంగాణ పర్యాటక శాఖకు అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపడ్తున్న కార్యక్రమాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపైన తెలంగాణ పర్యాటక శాఖ ప్రాతినిధ్యం గురించి సభకు వివరించారు. ప్రవాస తెలంగాణ సంస్థలుగా, బాధ్యత గల ప్రవాస తెలంగాణ బిడ్డలుగా అందరూ ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి”బంగారు తెలంగాణ” నిర్మాణక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధికి కలిసిరావాలని పిలుపునిచ్చారు.

అన్ని రంగాల్లో కంటే పర్యాటక రంగంలో పెట్టుబడులకి తెలంగాణ రాష్ట్రం అనువైన రాష్ట్రమని, వివిద అవకాశాల గురించి వివరించారు. పర్యాటక శాఖ అభివృద్ధికి యూకే-యూరప్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరంని అంబాసిడర్ గా చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటుచేసి అందరి సూచనలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

చివరిగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, స్వంతగా ఇప్పటివరకు తెలంగాణ అబివృద్ధికి ఎంతో కృషి చేశామని, ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఖచ్చితంగా మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరంని యూకే- యూరప్ అంబాసిడర్ గా గుర్తించినందుకు ప్రభుత్వానికి, కే.సీ.ఆర్ గారికి, ముఖ్యంగా వ్యక్తిగతంగా వచ్చి మాలో ఎంతో స్ఫూర్తి నింపిన తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి మరియు ఈవెంట్స్ ఇన్ఛార్జ్ నగేష్ రెడ్డితో పాటు సభ్యులు రత్నాకర్, సుమాదేవి, నరేశ్, శ్రీకాంత్ జెల్ల, స్వామి ఆశ, మీనాక్షి అంతటి, విక్రమ్ రెడ్డి, శ్రీనివాస్, సత్య, ప్రీతి, జ్యోతి రెడ్డి, గుప్త, కందాల ట్రావెల్స్ అధినేత ప్రమోద్ కందాల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *