బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. సర్దార్ పాపన్న గౌడ్ వేడుకలను అధికారికంగా జరపాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గతంలో సీఎం కేసీఆర్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు లేఖ రాశారు. లేఖపై స్పందించిన సీఎం కేసీఆర్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఆదేశించారు. అలాగే జయంతిని ఘనంగా నిర్వహించేందుకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గౌడ సామాజిక వర్గం తరుపున సీఎం కేసీఆర్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆగస్టు 8న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్లు పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలియజేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గౌడ సంఘాల ప్రతినిధులు జయంతి వేడుకల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
